దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదల.. ఈసారి వెంకటేష్ రీమేక్ లేదు!

  • ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ వెర్షన్
  • మే 21న మలయాోళంతో పాటు తెలుగులోనూ రిలీజ్
  • శత్రువు ఎవరో తెలియక జార్జ్‌‌కుట్టి భయపడుతున్నాడన్న దర్శకుడు
  • దృశ్యం 4 కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చిన మోహన్‌లాల్ 
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' తెలుగు ట్రైలర్ విడుదలైంది. సోమవారం విడుదలైన ఈ ట్రైలర్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఓ ముఖ్యమైన సందేహానికి తెరపడింది. గత రెండు భాగాల్లా కాకుండా, ఈసారి వెంకటేష్‌తో రీమేక్ ఉండదని, మలయాళ వెర్షన్‌నే తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారని స్పష్టమైంది. మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా మే 21న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఈసారి కథలో కొత్త కోణాన్ని చూపించబోతున్నట్టు దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. "గత రెండు భాగాల్లో జార్జ్‌ కుట్టికి తన వెనుక ఎవరున్నారో తెలుసు. కానీ ఈసారి తనను ఎవరు వెంబడిస్తున్నారో, శత్రువు ఎవరో తెలియని భయంలో అతను ఉంటాడు. ఇదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది" అని జీతూ జోసెఫ్ వివరించారు. ఈ తెలియని భయమే ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

ఇటీవల కొచ్చిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మోహన్‌లాల్ సరదాగా మాట్లాడుతూ.. "జార్జ్‌కుట్టిని కాపాడమని నేను చాలాసార్లు అడిగాను, కానీ అతను ఇంకా సేఫ్ కాలేదు. కాబట్టి మీరు దృశ్యం 4 కూడా ఆశించవచ్చు" అని వ్యాఖ్యానించి, సీక్వెల్స్‌‌పై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖ్, ఆశా శరత్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం రన్ టైమ్ 2 గంటల 39 నిమిషాలుగా ఉంది. సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Mohanlal
Drishyam 3
Drishyam 3 Telugu
Telugu Dubbed Movie
Jeethu Joseph
Meena
Venkatesh
Aashirvad Cinemas
Suspense Thriller
Malayalam Movie

More Telugu News